తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్ల స్థలాలు కేటాయించాలి:
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు నిచ్చి, పెన్షన్తో పాటు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని భీమారం మండల ఉద్యమకారుల సంఘం (2001) నాయకులు డిమాండ్ చేశారు. మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సదానందం కి తెలంగాణ ఉద్యమకారులు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజల హక్కులు, సంపద పరిరక్షణే ధ్యేయంగా నాడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతియుత మార్గంలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. నాటి ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ అణచివేత చర్యలను అనుభవించిన ప్రతి ఒక్కరినీ తెలంగాణ ఉద్యమకారులుగా అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
భీమారం మండల కేంద్రంలో అర్హులైన ఉద్యమకారులందరికీ నివాస యోగ్యమైన భూమిని కేటాయించి, ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, అలాగే జీవనోపాధి కోసం నెలనెలా పెన్షన్ సదుపాయం కల్పించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో భీమారం మండల ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షులు దాసరి మధునయ్య , ఉపాద్యక్షులు దుర్గం లాజర్, గౌరవ అధ్యక్షులు పోటు మురళిధర్ రెడ్డి మరియు ఉద్యమ కారుల సంఘం గౌరవ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.